)
Ysrcp Strategy: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైనాట్ 175 లక్షం పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ టికెట్ల కేటాయింపులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు ఖరారైంది. రేపో మాపో సీట్ల కేటాయింపుపై స్పష్టత వస్తుంది. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. పని తీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు టికెట్ ఉండదని..ప్రజలకు చేరువ కావాలని ఏడాదిగా చెబుతూ వస్తున్న జగన్ ఇక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దాదాపు 50 మందిని మార్చేసేందుకు నిర్ణయించారు. మరోవైపు సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోస్తా జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు కలిగిన కాపు సామాజికవర్గంపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కాపు సామాజికవర్గముంది. జనసేనతో టీడీపీ పొత్తు ఖరారు కావడంతో ఆ సామాజికవర్గం ఓట్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. కాపు సామాజికవర్గంలో మెజార్టీ భాగం జనసేనకు బదిలీ కావచ్చు. జనసేన-టీడీపీ కూటమికి కాపు ఓటింగ్ పడకుండా పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే ఎంత ఓటింగ్ నిలువరించగలిగితే అంత మేలు కలుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు. అందుకే కాపు ఓటింగ్ ఆకర్షించే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
కాపు సామాజికవర్గంలో గణనీయమైన ప్రభావం కలిగిన ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముద్రగడతో పార్టీ ఇప్పటికే మంచి సంబంధాలు కలిగి ఉంది. రేపో మాపో ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయం. కాపు ఉద్యమ సమయంలో కూడా వైసీపీ ముద్రగడకు అండగా నిలిచింది. ఆ ఉద్యమం సమయంలో అప్పటి ప్రభుత్వం కాపు నేతలపై మోపిన కేసుల్ని వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసింది.
ఇక మరో ముఖ్యనేత వంగవీటి రాధ. వాస్తవానికి వంగవీటి రాధ గతంలో వైసీపీలోనే ఉన్నా పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి ఆతనిని పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అతని సన్నిహితులిద్దరూ కొడాలి నాని, వల్లభనేని వంశీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. వంగవీటి రాథకు విజయవాడ సెంట్రల్తో పాటు ఆయన సోదరికి ఓ సీటు కేటాయించే అవకాశాలున్నాయి. ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. వంగవీటి నుంచే ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook