Chandrababu Naidu: చంద్రబాబు సంచలన నిర్ణయం.. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి..?

AP Assembly Elections: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పంతోపాటు పెనమలూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 31, 2023, 06:15 PM IST
Chandrababu Naidu: చంద్రబాబు సంచలన నిర్ణయం.. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి..?

AP Assembly Elections: ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. నారా లోకేష్ పాదయాత్రతో ఇప్పటికే పర్యటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో పేరుతో పర్యటించారు. 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ' పేరుతో రంగంలోకి దిగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఇప్పటికే అధికార పార్టీ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు. అన్ని పార్టీల నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. 

తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి బరిలో నిలవనున్నారు. ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది. చంద్రబాబు కుప్పంతో పాటు పెనమలూరు నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. గతంలో భీమవరం, గాజువాక నుంచి అసెంబ్లీకి పవన్ పోటీ చేయగా.. అదే దారిలో చంద్రబాబు కుప్పంతో పాటు కృష్ణా, జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కుప్పంలో ఈసారి ఎలాగైనా గెలవాలని అధికార వైఎస్సార్సీపీ పట్టుదలతో ఉంది. చిత్తూరు జిల్లాలో మిగిలిన స్థానాల సంగతి ఎలా ఉన్నా.. కుప్పంపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. గతంతో పోలిస్తే చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కుప్పంలో తన పట్టును కోల్పోతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీనే గెలుచుకుంది. దీంతో కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు వాలయని అంటున్నారు.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ పెద్ద షాకే ఇచ్చింది. కౌంటింగ్‌ సమయంలో మొదటి 2 రౌండ్లలో  బాబుపై వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. చివరికి చంద్రబాబు విజయం సాధించినా.. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ కుప్పంపై మరింత పట్టు బిగించింది. ఇటు చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువగా కన్నేశారు. ఈ పరిస్థితుల్లో కుప్పంలో రిస్క్‌ తీసుకోకూడదని భావిస్తున్న చంద్రబాబు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుపతికి మారుతారని, లోకేష్‌ను కుప్పం నుంచి పోటీ చేయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. 2024లో మాత్రం కృష్ణాజిల్లాలో సొంత  సామాజికవర్గం బలంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారని సమాచారం.

Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..   

Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News