YS Vivekananda Murder Case: ప్రాణ హాని ఉందంటూ కడప ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు...

YS Vivekananda Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ తనకు ప్రాణ హాని ఉందని కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్‌కు నాలుగు పేజీల వినతిపత్రం అందజేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 10:06 PM IST
  • కడప ఎస్పీని కలిసిన వివేకా పీఏ
  • తనకు ప్రాణ హాని ఉందన్న పీఏ
  • రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం
 YS Vivekananda Murder Case: ప్రాణ హాని ఉందంటూ కడప ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు...

YS Vivekananda Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder) కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ప్రాణ హాని ఉందని, కొంతమంది తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి కడప ఎస్పీ అన్బురాజ్‌కు ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో కొంతమంది తనపై ఒత్తిడి తెస్తున్నారని... తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్‌కు నాలుగు పేజీల వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రంలో వైఎస్ వివేకానంద కుమార్తె సునీత (YS Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల పేర్లను కృష్ణారెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శివప్రకాష్ రెడ్డి అనే మరో వ్యక్తి పేరు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ అన్బురాజన్... గత 30 ఏళ్లుగా అతను వివేకా ఇంట్లో పనిచేస్తున్నారని తెలిపారు. వివేకా హత్య కేసులో అతను అనుమానితుడిగా ఉన్నట్లు చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

సుదీర్ఘ కాలం పాటు వైఎస్ వివేకా కుటుంబంతో పనిచేసిన కృష్ణా రెడ్డి... ఆ కుటుంబ సభ్యుల పైనే ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా వైఎస్ సునీత, మరికొందరు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ అక్కడి ఎస్పీ ఫకీరప్పకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు మరికొందరిని ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపించాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని (Kadapa SP) కోరారు. 

వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Murder) 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై జగన్ సర్కార్ సిట్ విచారణకు ఆదేశించగా... సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు సీబీఐకి బదిలీ అయింది. ఇప్పటికే పలువురు నిందితులు, అనుమానితులను సీబీఐ విచారించింది. గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, షేక్‌ దస్తగిరిలపై ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరనేది ఇంకా తేలలేదు. 

Also Read: Video: ముద్దుల్లో మునిగితేలుతున్న కోతులు-తల్లి కోతి నిద్ర చెడకుండా పిల్ల కోతి ఆరాటం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News