BJP Foundation Day 2022: బీజేపి ఇంత పెద్ద పార్టీగా ఎలా అవతరించింది, ఎలా గెలిచి నిలిచింది.. స్పెషల్ స్టోరీ

BJP Foundation Day 2022: భారతీయ జనతా పార్టీ... సంక్షిప్తంగా బీజేపీ. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న ఎన్డీయేను నడిపిస్తున్న అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇప్పుడు రెండోసారి దేశాన్ని నడిపిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీకి భిన్నంగా దేశంలో ఇప్పుడు పాలన కొనసాగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 12:37 PM IST
  • పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తి
  • బీజేపిపై మతతత్వ పార్టీ అని ముద్రవేసేందుకు కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల కుట్రలు
  • కుట్రలను తిప్పికొట్టి తిరుగులేని శక్తిగా అవతరించిన బీజేపి
BJP Foundation Day 2022: బీజేపి ఇంత పెద్ద పార్టీగా ఎలా అవతరించింది, ఎలా గెలిచి నిలిచింది.. స్పెషల్ స్టోరీ

BJP Foundation Day 2022: భారతీయ జనతా పార్టీ... సంక్షిప్తంగా బీజేపీ. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న ఎన్డీయేను నడిపిస్తున్న అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇప్పుడు రెండోసారి దేశాన్ని నడిపిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీకి భిన్నంగా దేశంలో ఇప్పుడు పాలన కొనసాగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజారంజక పాలన అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. 

భారతీయ జనతా పార్టీ అంటే ఓ మతతత్వ పార్టీ అంటూ కాంగ్రెస్‌, ఇతర పక్షాలు తొలినుంచీ ఓ రకమైన ముద్ర వేశాయి. భారత్‌కు పొరుగున్న ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, భారత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల పరిస్థితి అలా తయారవుతుందన్న ప్రచారం ఎక్కువగా కొనసాగింది. కానీ, ఇప్పుడు రెండోసారి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో కొనసాగుతున్నా.. సంక్షేమాలు, సంస్కరణలు అమలవుతున్నాయి. ప్రజా సంక్షేమం, సంస్కృతి, ధార్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలకు బీజేపీ సమస్థానం ఇస్తోందన్న వాదనలు బలపడుతున్నాయి. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీపై దేశవ్యాప్తంగా ఒకరకమైన వ్యతిరేకత నెలకొందన్న ప్రచారం జరిగినప్పటికీ.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్టాల్లో విజయం సాధించడం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. 

భారతీయ జనతాపార్టీకి మాతృసంస్థ జనసంఘ్‌. అయితే, జనసంఘ్‌ 70వ దశకంలో అప్పటికే వేళ్లూనుకున్న కాంగ్రెస్‌పార్టీని గట్టిగా ఎదుర్కోలేకపోయింది. ఆ తర్వాత లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ నేతృత్వంలో ఆవిర్భవించిన జనతాపార్టీలో జనసంఘ్‌ విలీనమైపోయింది. 1977లో జనతాపార్టీ విజయం సాధించి కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. కానీ, రెండేళ్లకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితంగా జనతాపార్టీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత పూర్వపు జనసంఘ్‌ నేతలు, ఆలోచనలు కలిసిన వాళ్లంతా ఐక్యంగా 1980 ఏప్రిల్‌ 6వ తేదీన  భారతీయ జనతాపార్టీని స్థాపించారు. బీజేపీని నిశితంగా గమనిస్తే పంచనిష్ట సూత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. జాతీయవాదం, జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత, గాంధేయ సోషలిజం పట్ల నిబద్ధత, సర్వధర్మ భావన అనే లౌకిక వాదంపై నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలు అనే ఐదు సూత్రాలను పార్టీ ఆశయంగా మలచుకున్నారు. ప్రస్తుతం మోదీ ‘సబ్‌ ‌కా సాథ్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌’‌కు అదే ప్రేరణగా నిలిచింది.

స్వతంత్ర భారత దేశంలో జరిగిన రెండు అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో మొదటిది ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం అయితే, రెండోది అయోధ్యలో రామజన్మభూమి విముక్తి ఉద్యమం. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలనలో మసీదు నిర్మించారు. ఆ ఆలయ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని, అక్కడ భవ్య రామ మందిరాన్ని నిర్మించాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నా.. అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ సహా ఇతర ‌రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ముస్లింల ఓట్ల కోసం ప్రజల మనోభావాలను గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో అయోధ్య ప్రజా ఉద్యమానికి బాహాటంగా మద్దతు పలికిన ఏకైక పార్టీ బీజేపీ. ఈ పరిణామం ఒకరకంగా దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఆద్వానీ 1990లో సోమనాథ్‌ ‌నుంచి అయోధ్య వరకు పది వేల కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో నాలుగు రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసినప్పటికీ, పార్టీ నాయకులపై తప్పుడు కుంభకోణాల అభియోగాలు మోపినప్పటికీ భారతీయ జనతాపార్టీ ఏమాత్రం తగ్గలేదు.     అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తుది తీర్పు రావడంతో ఆ ఉద్యమానికి సంబంధించిన అన్ని సమస్యలు సమసిపోయాయి. ఉద్యమం మొదలైన మూడు దశాబ్దాల తర్వాత రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 

ఈ పరిణామాల తర్వాత పలు పార్టీల మద్దతుతో బీజేపీ 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో అధికారంలో కొనసాగింది. ఇక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభలోని మొత్తం 543 సీట్లలో.. తన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి-ఎన్డీయే నేతృత్వంలో 281 స్థానాలు గెలుచుకొంది. నరేంద్రమోడీ నాయకత్వంలో అధికారం చేపట్టింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించి రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. 

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ఆ ఆర్టికల్‌ ఎత్తేస్తే వేర్పాటువాదం విజృంభిస్తుందని, కశ్మీర్‌ భారత్‌కు శాశ్వతంగా దూరమవుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. కానీ, ఆ వాదనలు అసంబద్ధమన్న విషయం జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమయ్యింది. జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

పౌరసత్వ సవరణ చట్టం అనేది.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం పౌరసత్వ చట్టం-1955లో సవరణ తెస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 2019 డిసెంబరు 9వ తేదీన పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ వంటి ముస్లిం దేశాల నుంచి మనదేశానికి వలస వచ్చే ఆ దేశాల్లోని మైనారిటీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ పరిణామంతో మార్గం సులువయ్యింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయం త్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దు. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోడీ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 2018 డిసెంబర్‌ 27న లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ముస్లిం మహిళలకు ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌చెప్పడం నేరం. త్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దును ముస్లిం మహిళలంతా ఆహ్వానించారు. 

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఇటీవలే రాజ్యసభలోనూ చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికల తర్వాత బీజేపీ తన చరిత్రలో మొదటి సారి ఎగువ సభలో 100 మంది సభ్యుల మైలురాయిని సాధించింది. ఇలా విజయపథంలో దూసుకుపోతున్న బీజేపీ.. ఇవాళ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi latest news) శోభాయాత్రలో పాల్గొననున్నారు. శోభాయాత్ర తర్వాత మోడీ ప్రసంగాన్ని మండల, గ్రామస్థాయిలో వినేందుకు బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలందరూ కాషాయ టోపీలు ( ధరించి బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు.

Also read : Meet Ban: మాంసం కూడా ఉల్లి, వెల్లుల్లి లాంటిదే, అపవిత్రం కాదు..ఒవైసీ వ్యాఖ్యలు

Also read : RSS Founder KB Hedgewar: ఆర్ఎస్ఎస్ ఎలా పుట్టింది, జాతీయ శక్తిగా ఎలా ఎదిగింది.. అసలు హెడ్గెవార్ ఎవరు.. ఆసక్తికరమైన అంశాలతో పూర్తి విశ్లేషణాత్మాక కథనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News