నాకు ఓటేయండి.. లేదా శపిస్తాను అంటున్న బీజేపి ఎంపి

నాకు ఓటేయండి.. లేదా శపిస్తాను అంటున్న బీజేపి ఎంపి

Last Updated : Apr 13, 2019, 07:23 AM IST
నాకు ఓటేయండి.. లేదా శపిస్తాను అంటున్న బీజేపి ఎంపి

ఉన్నావ్: ఎన్నికల ప్రచారంలో ఓవైపు ఓటరు దేవుళ్లను ఓట్లు అభ్యర్థించడానికి వెళ్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటే, మరోవైపు బీజేపి ఎంపి సాక్షి మహారాజ్ మాత్రం ఓటర్లను విచిత్రంగా తనదైన స్టైల్లో బెదిరించి మరీ ఓట్లు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సాక్షి మహారాజ్‌కి బీజేపి ఈసారి కూడా లోక్ సభ టికెట్ కేటాయించింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉన్నావ్‌లో ప్రచారానికి వెళ్లిన సాక్షి మహారాజ్.. అక్కడ ఓటర్లకు విచిత్రంగా ఓ హుకుం జారీచేశారు. మీరు (ఓటర్లు) తనకు ఓటేయాల్సిందేనని నేరుగానే డిమాండ్ చేసిన సాక్షి మహారాజ్.. లేనిపక్షంలో మిమ్మల్ని శపిస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 

తాను ఓ సాధువునని, సాధువు ఎవరినైనా ఏదైనా అడిగి, అది పొందనట్టయితే, ఆ తర్వాత వారి సిరి సంపదలన్నీ హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయని సాక్షి మహారాజ్ సెలవిచ్చారు. తానేమీ మీ (ఓటర్లు) ఆస్తిపాస్తులు అడగడం లేదని, 125 కోట్ల మంది భారతీయుల తలరాతలను మార్చే మీ విలువైన ఓటును తనకే వేయమని అడుగుతున్నానని వేదాంతం చెప్పుకొచ్చారు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో కనిపించే సాక్షి మహరాజ్ వింత వైఖరి చూసి ఓటర్లే షాక్ అవుతున్నారు.

Trending News