Onions prices : రూ.10-20కే కిలో ఉల్లి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్ !

ఉల్లి ధరల పెంపుపై ఆగ్రహించిన ఇద్దరు యువకులు తీసుకున్న ఓ నిర్ణయం వారిని కటకటాల పాలయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Last Updated : Dec 26, 2019, 05:55 PM IST
Onions prices : రూ.10-20కే కిలో ఉల్లి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్ !

గ్వాలియర్: ఉల్లి ధరల పెంపుపై ఆగ్రహించిన ఇద్దరు యువకులు తీసుకున్న ఓ నిర్ణయం వారిని కటకటాల పాలయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరల కారణంగా సామాన్యులకు ఉల్లి అందుబాటులో లేకుండా పోవడంపై ఆగ్రహం చెందిన అజయ్ జాతవ్, జీతు వాల్మికి.. సమీపంలోని కూరగాయల మార్కెట్‌లోని ఓ గోడౌన్‌ నుంచి ఆరు క్వింటాళ్ల ఉల్లిగడ్డ, మరో క్వింటాల్ ఎల్లిగడ్డ దొంగిలించారు. దొంగిలించిన ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డను మరో చోట బహిరంగ మార్కెట్‌లో రూ.10-20లకే విక్రయించారు. తద్వారా సామాన్యులకు కారుచౌకగా ఉల్లి అందించేలా చేస్తున్నామనే భావించారు కానీ తాము చేస్తోంది నేరం అని తెలుసుకోలేకపోయారు.

ఇదిలాఉండగా.. మార్కెట్‌లో ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఉండగానే ఇద్దరు యువకులు ఇలా తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు. రూ.100 కాస్త అటు ఇటుగా అమ్ముడవుతున్న ఉల్లిగడ్డను రూ.10-20కే ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా యువకులు తమ నేరాన్ని అంగీకరించారు. ఉల్లి ధరలు పెరుగుతున్న వైనం తమను తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురిచేసిందని.. అందుకే అలా ఉల్లిని దొంగిలించి తక్కువ ధరకే విక్రయించామని వివరించారు. 

ఈ ఘటనపై జనక్‌గంజ్ పోలీసు స్టేషన్ హౌజ్ ఇంచార్జ్ ప్రీతీ భార్గవ్ మాట్లాడుతూ.. యువకులు దొంగిలించిన సొత్తు విలువ రూ.60,000 విలువ చేస్తుందని తెలిపారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు ప్రీతి భార్గవ్ వెల్లడించారు.

Trending News