పాక్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆర్మీ చీఫ్ రావత్

పాక్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆర్మీ చీఫ్ రావత్

Last Updated : Sep 23, 2018, 05:19 PM IST
పాక్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆర్మీ చీఫ్ రావత్

ఓ వైపు శాంతి చర్చలు అంటూ మరోవైపు దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌తో చర్చలకు భారత ప్రభుత్వం విముఖత తెల్పడం సరైన నిర్ణయమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు.  జైపూర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ సైన్యం, ఉగ్రవాదుల అనాగరి, ఆటవిక చర్యలపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సరిహద్దులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌‌ను పాక్‌ సైనికులు తుపాకీతో కాల్చి, కత్తితో గొంతు కోయడం, కశ్మీర్‌లో పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటనలపై రావత్‌ ఈ మేరకు స్పందించారు. భారత సైనికులను దొంగ దెబ్బ తీసిన పాక్‌కు గట్టిగా బదులు చెబుతామన్నారు.

'పాక్ అవలంభిస్తున్న ద్వంద్వ విధానాలకు ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. భారత ఆర్మీ ఇప్పటివరకు చాలా బాధను భరించింది. మా సైనికులు పడ్డ బాధ ఎలా ఉంటుందో పాక్ ఆర్మీకి, ఉగ్రవాదులకు కూడా కలిగేలా చేస్తాం' అని రావత్‌ చెప్పారు. భారత్‌ బాధను పాకిస్తాన్‌కూ తెలియజేస్తామని.. వారిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అయితే పాకిస్థాన్ పాటించే అనారిగక విధానాలను భారత్‌ అనుసరించకూడదని ఈ సందర్భంగా తెలిపారు.

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ: పాక్‌  

భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా శాంతినే కోరుకుంటున్నట్లు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ తెలిపారు.

Trending News