దసరా కానుక: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు

వాహనదారులకు ఊరట: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు

Last Updated : Oct 19, 2018, 10:32 AM IST
దసరా కానుక: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు

దసరా సందర్భంగా వాహనదారులకు ఇంధన ధరల నుంచి భారీ ఊరట లభించింది. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు శుక్రవారం తగ్గాయి.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.82.38లు ఉండగా, డీజిల్‌ రూ.75.48లుగా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గాయి. ధరలు తగ్గిన అనంతరం ముంబాయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.87.84లు ఉండగా డీజిల్‌ రూ.79.13లు ఉంది.

అలాగే కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. శుక్రవారం కోల్‌కతా‌లో లీటరు పెట్రోల్ 84.21 రూపాయలుగా, లీటర్ డీజిల్ రూ. 77.33గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర లీటరు 85.63 రూపాయలుగా, డీజిల్ ధర లీటరు రూ .79.82 వద్ద స్థిరపడింది.

అటు హైదరాబాద్‌లో శుక్రవారం పెట్రోల్ ధర లీటరు రూ.87.33, డీజిల్ ధర లీటర్ రూ.82.10కి చేరింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.86.39 ఉండగా,  డీజిల్‌ రూ.80.78లు ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న (గురువారం) కూడా తగ్గాయి. ఢిల్లీ, ముంబాయిలలో పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గించారు.

అటు రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కళ్లెం వేయడానికి సోమవారం సాయంత్రం (15.10.2018)న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇంధన సంస్థల ప్రతినిధుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధనం ధరల పెరుగుదలపై సమీక్షించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని చమురు సంస్థల ప్రతినిధులకు తెలిపారు.

ఇటీవలే ఈ  నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌ రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. మళ్లీ ఇంధనం ధరలు పెరిగిపోయాయి. దీంతో మరోమారు సమావేశం నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

 

Trending News