ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం

Last Updated : Mar 6, 2018, 07:56 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని మరో సారి స్పష్టం చేసింది. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని  కేంద్రం ఆర్ధిక శాఖ  కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. నిన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ఆర్ధిక మంత్రి యనమల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి యనమలకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని యనమల గట్టిగా అడిగినట్లు తెలిసింది. అయితే ఏపీకి హోదా ఇవ్వలేమని ప్యాకేజీ మాత్రమే అమలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే పరిశ్రమలకు రాయితీ అంశాన్ని కూడా మంత్రి యనమల ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై ఆర్ధిక మంత్రి జైట్లీ స్పందిస్తూ ఏపీ పరిశ్రమలకు రాయితీలు ఇస్తే ఒడిషా,బీహార్, బెంగాల్ రాష్ట్రాలు సైతం డిమాండ్ చేసే అవకాశముందని.. అయితే ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చించి తమ వైఖరి ప్రకటిస్తామని చెప్పినట్లు తెలిసింది.

ఇచ్చిన నిధులకు ఏపీ సర్కార్ లెక్క చెప్పలేదు...
ఈ సందర్భంలో ఆర్ధిక మంత్రి జైట్లీ ఏపీకి ప్యాకేజీ కింద ఇచ్చిన నిధులపై ఇప్పటి వరకు లెక్క ఎందుకు చెప్పలేదని ఆర్ధిక మంత్రి యనమలను నిలదీసినట్లు తెలిసింది. స్పెషల్ ప్యాకేజీ కింద ఏపీకి 12.5 కోట్లు ఇచ్చామని..దీనిపై ఒక్క రూపాయి కూడా లెక్క చెప్పాలేదని పేర్కొన్నట్లు తెలిసింది. తెలుగు సానుభూతి అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఏపీ నేతలు సతమతమవుతున్నారని  జైట్లీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

Trending News