జగన్..పవన్ ఒక్కటైతే టీడీపీకి డిపాజిట్లు దక్కవు - మోత్కుపల్లి

Last Updated : May 28, 2018, 10:45 PM IST
జగన్..పవన్ ఒక్కటైతే టీడీపీకి డిపాజిట్లు దక్కవు - మోత్కుపల్లి

జగన్..పవన్ ఒక్కటైతే..ఏమవుతుంది  ?..దీనికి జవాబు టీటీపీ రెబల్ నేత మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే టీడీపీకి డిపాజిట్లు గల్లంతవుతాయని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్డీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు.

టి.సర్కార్‌ను కూల్చేందుకు బాబు కుట్ర
చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మోత్కుపల్లి ..మరో సంచలన ఆరోపణ చేశారు.  తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని.. అయితే కేసీఆర్ తెలివైన వారు కాబట్టి ..చంద్రబాబు కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని వెల్లడించారు. 

ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు 
ఎన్డీయే కూటమితో కలిసి ఉన్నప్పుడు తనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చెప్పి చంద్రబాబు తనను మోసం చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. తెలంగాణ మహానాడుకు ఆహ్వానించకుండా తనను చంద్రబాబు ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.  అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏపీలో రథయాత్ర చేస్తానని ఈ సందర్భంగా మోత్కుపల్లి ప్రకటించారు.

Trending News