ప్లేఆఫ్ పోరుకు సిద్ధమవుతున్న హైదరాబాద్, చెన్నై

Last Updated : May 22, 2018, 09:09 AM IST
ప్లేఆఫ్ పోరుకు సిద్ధమవుతున్న హైదరాబాద్, చెన్నై

ఐపీఎల్ 11 సీజన్‌లో ప్లేఆఫ్ పోరు నేడు ప్రారంభం కానుంది. ముంబై వేదికగా నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ (కోల్‌కతా vs రాజస్థాన్)లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ముంబాయి వాంఖేడ్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

టేబుల్‌ టాపర్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ను ఇప్పటికే రెండు సార్లు చెన్నై మట్టికరిపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇరుజట్లు మైదానంలోకి దిగుతున్నారు. గెలిచిన జట్టు నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తుంది కనుక ప్రతీకార విజయంతో పాటు ఫైనల్‌కు తామే వెళ్లాలని హైదరాబాద్‌ ఆశిస్తోంది. కానీ ఎప్పటిలాగే తమ ఆధిపత్యాన్ని కొనసాగించి రెండో క్వాలిఫయర్‌ అవసరం లేకుండా చూసుకోవాలని చెన్నై భావిస్తోంది. ఏది ఏమైనా బౌలింగే ఆయుధంగా ప్రత్యర్థులను వణికించిన సన్‌రైజర్స్‌.. బ్యాటింగ్‌ పోరుతో అదరగొట్టిన సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే ఈ పోరు నేడు వీక్షకులకు ఉత్కంఠ రేపడం ఖాయం.

కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో క్వాలిఫైయర్-1లో నెగ్గిన జట్టుతో ఆదివారం మే 27, 2018, రాత్రి 7 గంటలకు ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీ పడుతుంది.

Trending News