KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూ

KCR Donates One Month Salary Along With BRS Party MLA MP And MLCs: వరద బాధితులకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌తో సహా ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 4, 2024, 03:26 PM IST
KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూ

KCR Salary Donation: భారీ వర్షంతో వరదలు ముంచెత్తి నష్టపోయిన బాధిత కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ అండగా నిలుస్తోంది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ తాజాగా బాధితులకు భారీ సహాయం ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోయినా కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నామని గుర్తించి ఆపత్కాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ సూచనల మేరకు గులాబీ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు (రాజ్యసభ), శాసనమండలి సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కల్వకుంట్ల కవితతో సహా ప్రజాప్రతినిధులందరూ తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు.

Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

 

సిద్దిపేటలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. 'వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశానుసారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా వరదలతో సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తాం. ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడింది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని హరీశ్ రావు తెలిపారు. 

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌

ఖమ్మంలో వరద పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ తీరుపై మండిపడ్డారు. 'వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదు.. ఇదే ప్రభుత్వ వైఫల్యమే' అని స్పష్టం చేశారు. 'శనివారం రోజు 21 అడుగులకు నీటిమట్టం చేరింది. 21 అడుగులకు చేరిన ఒక ఇల్లు కూడా మునగదు. కాకపోతే నీటిమట్టం 18 అడుగులకు చేరగానే మైకులలో ప్రకటన చేసి ట్రాక్టర్లు, వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలను సామాగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కానీ అది చేయలేదు. ఆదివారం ఉదయం 33 అడుగులకు నీటిమట్టం చేరింది. అప్పటికి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు, ప్రకటన ఏదీ చేయలేదు. ప్రజలే స్వచ్ఛందంగా అయ్యో రామచంద్ర అని అనుకుంటూ వారి సామగ్రిని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోయారు' అని పువ్వాడ అజయ్‌ వివరించారు.

'తమకు ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజలు చెబుతున్నారు. సహాయ చర్యలు తీసుకోవడంలో బాధితులకు ఆహారం, నీళ్లు అందించడంలో రేవంత్‌ ప్రభుత్వం విఫలమయ్యారు. అన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి నాపై ఆరోపణలు చేశారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే నా ఆస్తులన్నింటిని కూల్చివేయండి' అని సవాల్‌ విసిరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News