Revanth Reddy Slams KCR : కాంగ్రెస్ పార్టీ సత్తా అంటే అట్లుంటది మరి.. రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.

Written by - Pavan | Last Updated : Aug 25, 2023, 05:58 AM IST
Revanth Reddy Slams KCR : కాంగ్రెస్ పార్టీ సత్తా అంటే అట్లుంటది మరి.. రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy Slams KCR : దాడులు చేయడం మా విధానం కాదు... అభివృద్ధి చేయడమే మా విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. “పేదల జీవన ప్రమాణాలు పెంచి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా విధానం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే మా విధానం ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం మా విధానం ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు సాయం చేయడం మా విధానం రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకోవడం మా విధానం” అన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్ కు ఏం జరిగింది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్... ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్ భావిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

“కొడంగల్ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే. కొడంగల్ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా? కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్ స్టేషన్లు తెచ్చింది మేము.. కొడంగల్ ప్రజలకు బస్ డిపో తెచ్చింది మేము...నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది. బీఆరెస్ హయాంలో నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి అన్యాయం చేశారు.. నేను చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆరెస్ చేసిందేం లేదు. జిల్లాలు పెంచి కొడంగల్ ను ముక్కలు చెక్కలు చేశారు” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
“నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే...నాలుగేళ్లు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం ఇప్పుడు అతని కడుపులో తల పెట్టిండు. ఇవాళ మంత్రి పదవి ఇచ్చిండు... నిన్నటి వరకు జుట్లు జుట్లు పట్టుకున్నోళ్లు ఇవాళ పదవులు పంచుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ మూడు రంగుల జెండాకు ఉన్న పవర్ వల్లే వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప... తాండూరుకు ఒరిగిందేంటి ” అని మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు. ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు తెలంగాణలో సామాజిక న్యాయం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. 

“రాజేందర్ కు, కేసీఆర్ కు పంచాయితీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఆయనపై కోపాన్ని కేసీఆర్ ముదిరాజ్ బిడ్డలపై చూపడం సరైంది కాదు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతానని కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు వర్గీకరణపై కేసీఆర్ మోదీని నిలదీయలేదు. ముదిరాజులకు, మాదిగ బిడ్డలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ కు ఓట్లు ఎందుకు వేయాలి. వర్గీకరణకు సహకరించని కేసీఆర్ కు మాదిగ బిడ్డలు ఎందుకు ఓటు వేయాలి? మన పిల్లలు బర్లు, గొర్లు పెంచుకోవాలట... వాళ్ల పిల్లలు రాజ్యాలు ఎలుతారట. నీళ్లు జగన్ రెడ్డికి, నిధులు మేఘా కృష్ణారెడ్డికి, నియామకాలు కేసీఆర్ కు వెళ్లాయి” అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయనుకున్నాం కానీ తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకుండా అడ్డుకున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. గోదావరి జలాలు కేవలం మెదక్ జిల్లాకే ఎందుకు పరిమితమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురూ తోడు దొంగలు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలం అవుతోందని బీఆర్ఎస్ పార్టీ పై సెటైర్ వేశారు. బీఆరెస్, ఎంఐఎం కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో నిరసన తెలిపే స్వేచ్ఛ లేదు....మేం అలా చేసి ఉంటే బీఆరెస్ అధికారంలోకి వచ్చేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో భూములను వేల కోట్లకు కేసీఆర్ తెగనమ్ముకున్నారు. ఫార్మా సెజ్ పేరుతో 40 వేల ఎకరాలు గుంజుకున్నారు.రంగారెడ్డి,  పాలమూరు జిల్లాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కొల్లగొట్టారు. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్, దావూద్ కంటే ఎక్కువ దోపిడీకి పాల్పడుతున్నారు. కేసీఆర్ కేటుగాళ్లకే కేటుగాడిగా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

కేసీఆర్ ను జైలులో పెట్టి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి ఉండేది
కేసీఆర్ పాలనలో అందరికంటే ఎక్కువ  అన్యాయానికి గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిధులు, నియామకాల్లో దళితులు, గిరిజనులకు భాగస్వామ్యం కల్పించేందుకు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చిందన్నారు. అభివృద్ధి నమూనా పేరుతో కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారు అని విమర్శించారు. గిరిజనులను చెట్లకు కట్టేసి కొట్టిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందన్నారు. ఇంత దారుణ పరిస్థితి వస్తుందని ఏనాడు కాంగ్రెస్ ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తారని తెలిసి ఉంటే.. కేసీఆర్ ను జైలులో పెట్టి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చదవండి : Patnam Mahender Reddy Takes Oath: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం

చేవెళ్లతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సెంటిమెంట్ 
చేవెళ్లతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉంది. చేవెళ్ల నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది విజయవంతం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మం సభ స్థాయిలో చేవెళ్ల సభను విజయవంతం చేయాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy: ఆ ఎమ్మెల్యే చచ్చిన శవాన్ని కూడా వదలడు: రేవంత్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News