
Gudlavalleru College Hidden Camera: ఏపీలోని గుడ్లవల్లేరు కళాశాలలో రహాస్య కెమెరాల సంఘటన తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థినుల వాష్రూమ్లలో రహాస్య కెమెరాలు ఉంచి వ్యక్తిగత వీడియోలను అమ్ముకున్న సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరు విద్యార్థులు చేసిన నీచపుపై పనితో వందలాది విద్యార్థినుల వీడియోలకు సంబంధించిన సంఘటనపై పోలీసులు, కళాశాల యాజమాన్యం సక్రమంగా స్పందించలేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరైన స్పందన కనిపించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ సంఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'చంద్రబాబు గారు ఇకనైనా మేల్కొండి' అంటూ విజ్ఞప్తి చేశారు.
గుడ్లవల్లేరు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో రహాస్య కెమెరాల ఉదంతం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో.. బాధిత విద్యార్థినులు కొన్ని గంటలుగా నిరసన వ్యక్తం చేస్తుండడంతో మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మూడు నెలల పాలనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిణామాలను ఏకరువు పెట్టి మండిపడ్డారు. విద్యా వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. తమ పార్టీపై విమర్శలు.. వేధింపులు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి పాలనను గాలి కొదిలేశారని ఆరోపించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా చంద్రబాబును జగన్ నిలదీశారు.
'చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కళాశాలలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీ (వైఎస్సార్సీపీ)పై బురద జల్లుడు వ్యవహారాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు' అని జగన్ విమర్శించారు. 'నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా.. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది' అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు' అని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇది' అని పేర్కొన్నారు. 'చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి' అని జగన్ హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook