గచ్చిబౌలి ప్రమాదం: బాధితురాలికి ఏపీ సీఎం జగన్ ఆర్థిక సహాయం... మేమున్నామన్న మంత్రి కేటీఆర్

గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుండి కారు కిందపడిన ప్రమాదం ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.

Last Updated : Nov 26, 2019, 02:36 AM IST
గచ్చిబౌలి ప్రమాదం: బాధితురాలికి ఏపీ సీఎం జగన్ ఆర్థిక సహాయం... మేమున్నామన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుండి కారు కిందపడిన ప్రమాదం ఘటనలో సత్యవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ప్రమాదం అనంతరం కుబ్రా బేగంను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్ నిమిత్తం రూ 5 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. సాధారణ పెయింటర్‌గా జీవనం సాగించే ఆ యువతి తండ్రి అబ్దుల్ అజీమ్ అంత డబ్బు చెల్లించే స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి వెంటనే ఈ విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పంచుకున్నారు. వెంటనే స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. కుబ్రా బేగం ఆపరేషన్ కోసం ఎంత ఖర్చయినా పర్వాలేదు తక్షణమే ఆపరేషన్ కోసం కావలసిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచెయ్యాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కుబ్రా బేగం చికిత్స కోసం వెంటనే రూ. 3,60,000 మంజూరు చేశారు.

Read also : Video | గచ్చిబౌలి బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి కింద పడిన కారు.. ఒకరు మృతి

ఇదిలావుంటే.. కుబ్రా బేగంను ఆదుకోవాల్సిందిగా కోరుతూ ట్విటర్ ద్వారా ఓ నెటిజెన్ చేసిన పోస్టుకు మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. తప్పకుండా కుబ్రా బేగంను ఆదుకుంటామని.. ఇప్పటికే ఆమెను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ని ఆదేశించడం జరిగిందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ తరహా ఘటనల్లో మంత్రి కేటీఆర్‌కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు రావడం ఇదేం తొలిసారి కాదు.. గతంలోనూ అనేక సందర్భాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంత్రి కేటీఆర్ తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. 

Trending News