"మహానటి"తో నటిస్తున్న దర్శకులు వీరే

  

Last Updated : Oct 22, 2017, 12:55 PM IST
"మహానటి"తో నటిస్తున్న దర్శకులు వీరే

గమ్యం, వేదం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు క్రిష్. అలాగే "పెళ్ళిచూపులు" సినిమాతో ఒక ప్రత్యేకమైన యూత్ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు కూడా నటనలో తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రంలో నటిస్తున్నారు. అందులో క్రిష్ అలనాటి దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రను పోషిస్తుంటే, తరుణ్ భాస్కర్ మరో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పాత్రలో నటిస్తున్నారట. ఇదే చిత్రంలో నటుడు మోహన్‌బాబు ఎస్వీ రంగారావు పాత్రను పోషిస్తున్నారని వినికిడి. అయితే అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఎయన్నార్ పాత్రలలో ఎవరు నటిస్తున్నారో తెలియడం లేదు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతవరకు వివాదాస్పదమైన బయోగ్రఫీ సావిత్రి జీవితం. ఆమె పాత్ర ప్రేరణతోనే రావూరి భరద్వాజ లాంటి రచయిత "పాకుడురాళ్ళు" నవల రాశారని కూడా అంటారు. ప్రస్తుతం "మహానటి" చిత్రానికి నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. సమంత, షాలిని పాండే, దుల్కర్ సాల్మన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది.

Trending News