
Amit Shah Warns To Tamilisai: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక అతిథిగా హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకరిని మందలించడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్కు క్లాస్ పీకారు.
గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద బుధవారం జరిగిన చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అతిథులుగా అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. వేదిక పైకి తమిళిసై వస్తూ అక్కడ కూర్చున్న అమిత్ షా, వెంకయ్య నాయుడుకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ప్రతినమస్కారం చేసిన అమిత్ షా ఆమె తిరిగి వెళ్తుండగా ప్రత్యేకంగా పిలిచారు.
ఆ సమయంలో తమిళిసైకి అమిత్ షా ఏదో సీరియస్గానే హెచ్చరించారు. వేలు చూపిస్తూ.. ఇలా చేయొద్దు అంటూ చేతివేళ్లతో అమిత్ షా చెప్పారు. అమిత్ షా చెప్పిన విషయాన్ని వెంకయ్య నాయుడు కూడా మద్దతు తెలిపారు. ఆయన చెప్పినట్టు చేయాలని సూచించారు. దాదాపు అర నిమిషం పాటు జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఏ విషయమై అమిత్ షా తమిళిసైని మందలించారనేది హాట్ టాపిక్గా మారింది. ఆమెకు ఏం చెప్పారని సర్వత్రా చర్చ జరుగుతోంది.
అన్నామలైతో వివాదం
తమిళనాడు బీజేపీలో కొన్ని రోజులుగా సరికొత్త వివాదం నడుస్తోంది. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైతో తమిళిసై మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. అన్నామలై, తమిళిసై మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిద్దరూ ఓడిపోయారు. బీజేపీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలిపించుకోలేకపోయింది. పార్టీ ఓటమిపై వీరిద్దరి మధ్య విమర్శలు మొదలయ్యాయి. అన్నామలై తీరుపై తమిళిసై బహిరంగ విమర్శలు చేశారు. దీనికి అతడు కూడా ప్రతి విమర్శలు చేయడంతో తమిళ బీజేపీలో వివాదం రాజుకుంది. పార్టీ పరువు పోతున్న విషయాన్ని గుర్తించిన అమిత్ షా తమిళిసై కనిపించగానే వెంటనే అదే విషయమై హెచ్చరించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook