జీ‌ఎస్‌టీ విషయంలో చిన్న వ్యాపారులకు ఊరట

                                            

Last Updated : Oct 7, 2017, 12:44 PM IST
జీ‌ఎస్‌టీ విషయంలో చిన్న వ్యాపారులకు ఊరట

ఢిల్లీ: చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకొనే వ్యాపారులకు కాసింత ఉపశమనం కలిగించండానికి జీ‌ఎస్‌టి మండలి పలు నిర్ణయాలు తీసుకొంది. కొన్ని మార్పులు కూడా చేసింది. అందులో దాదాపు 27 వస్తువులపై పన్ను తగ్గించడం విశేషం. అంతే కాకుండా ట్యాక్స్ చెల్లింపులు, రిటర్న్స్ దాఖలు లాంటి విషయాల్లో కూడా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నడుపుకొనే వ్యాపారులకు వెసులుబాటు కల్పించింది. శుక్రవారం జీఎస్టీ మండలి ఆధ్వర్యంలో జరిగిన చర్చ కొన్ని కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకొనే దిశగా వెళ్లింది. అందులో ముఖ్యమైనవి ఇవి
 

*వార్షిక టర్నోవరు 1.5 కోట్లు ఉన్న వ్యాపారులు నిబంధనల ప్రకారం ఇక నుండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రిటర్నులు సమర్పించాలి. ఈ నిర్ణయం అక్టోబరు 1వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా  ఉత్తర్వులు 
ఇస్తున్నట్లు మండలి తెలిపింది. 

 

*అదే విధంగా రిటర్న్స్ సమర్పించడం లాంటి విషయాల్లో అపోహలను తొలిగించడం కోసం, పద్ధతిని మరింత సులభతరం చేయడం కోసం కాంపోజిషన్ స్కీమ్‌లో మండలి మార్పులను సూచించింది. ప్రస్తుతం 75 లక్షల టర్నోవరు ఉన్నవారికే ఈ పథకం వర్తించే అవకాశం ఉండగా, పరిధిని పెంచి, కోటి రూపాయల టర్నోవరు ఉన్నవారికి కూడా వర్తింపజేసింది. 
 

*అలాగే కాంపోజిషన్ స్కీమ్ క్రింద వ్యాపారం చేసే వారు 1% పన్ను, మత్తు పానీయాలు కాకుండా ఇతర ఆహార, పానీయాలు సరఫరా చేసేవారు 5 % పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 
 

*అలాగే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఎగుమతిదారులకు రాయితీలు ప్రకటించింది. వారికి పన్ను వాపసు చేయాలని నిర్ణయించింది. జులై, ఆగస్టు నెలల్లో చెల్లించిన పన్నులను ఈ నెలలో వాపసు చేస్తుంది. కేవలం ఎగుమతులకు వస్తు సేకరణ చేసేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలా కాకుండా తయారీదారుల నుండి వస్తువులను కొనుగోలు చేసిన వారు మాత్రం 0.1 పన్ను చెల్లించాల్సిందే. 

Trending News