రాహుల్‌జీ.. ఆ రాష్ట్రం పేరు వందసార్లు రాయండి: బీజేపీ నేత

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలే ఓ కథనానికి సంబంధించిన లింక్ పోస్టు చేస్తూ.. మిజోరం బాలికలు సాధించిన విజయాన్ని ప్రశంసించారు. అయితే కథ అడ్డం తిరిగింది. 

Last Updated : Oct 30, 2018, 03:19 PM IST
రాహుల్‌జీ.. ఆ రాష్ట్రం పేరు వందసార్లు రాయండి: బీజేపీ నేత

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలే ఓ కథనానికి సంబంధించిన లింక్ పోస్టు చేస్తూ.. మిజోరం బాలికలు సాధించిన విజయాన్ని ప్రశంసించారు. అయితే కథ అడ్డం తిరిగింది. రాహుల్ సందేశంలో మిజోరం అనే పేరుకు బదులు మణిపూర్ అనే పేరు రాయడంతో ట్విట్టర్‌లో ఆయన పై విమర్శలు వెల్లువలా వచ్చి పడ్డాయి. రాహుల్ భారతదేశంలో ఉంటున్నా.. ఈశాన్య రాష్ట్రాలపై ఆయనకు ఎలాంటి అవగాహనా లేదని.. ఆయన దేశానికి ప్రధాని అయ్యాక మాత్రం ఆ రాష్ట్రాలకు ఏం చేయగలరని పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు.

బీజేపీ నేత అమిత్ మాలవ్యా అయితే మరొక అడుగు ముందుకేస్తూ.. రాహుల్ ఆ రాష్ట్రం పేరు వందసార్లు రాసి తనకు చూపించాలని తెలిపారు. మిజోరం, మణిపూర్ అనేవి రెండు వేరు వేరు రాష్ట్రాలన్న విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరారు. అయితే ట్విట్టర్‌లో దొర్లిన పొరపాటును వెంటనే రాహుల్ టీమ్ సరిదిద్దినప్పటికీ.. ఆ సమాచారం అప్పటికే వైరల్ అయిపోవడంతో అనేకమంది రాహుల్ గాంధీని ట్రోలింగ్ చేశారు. 

గతంలో కూడా రాహుల్ ఇలాంటి వివాదాల్లో పలుమార్లు చిక్కుకున్నారు. ఓ విద్యాలయానికి అతిథిగా వెళ్లినప్పుడు.. అక్కడ విద్యార్థిని ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని అడిగితే.. రాహుల్ తనకు ఎన్‌సీసీ అంటే ఏమిటో కూడా తెలియదని.. తనకు పెద్దగా దాని గురించి అవగాహన కూడా లేదని తెలిపారు. అప్పుడు కూడా రాహుల్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కళాశాలల్లో యువతీ యువకులను కార్యోన్ముఖులను చేసే  ఎన్‌సీసీ సంప్రదాయం గురించి తెలియని రాహుల్.. దేశ యువకులను ఎలా ముందుకు నడిపించగలరని కూడా బీజేపీ నేతలు అప్పట్లో మండిపడ్డారు. 

Trending News