BRS Vs Congress: డ్యామేజ్ ఎవరికి.. మైలేజ్ ఎవరికి..?

BRS Vs Congress: తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య సవాల్ల యుద్దం ముదురుతోంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించిన తాజా సమాచారం ఎంతో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Sep 14, 2024, 12:00 PM IST
BRS Vs Congress: డ్యామేజ్ ఎవరికి.. మైలేజ్ ఎవరికి..?

 

BRS Vs Congress: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం రోజుకో టర్న్ తీసుకుంటుందా...ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశం  తెలంగాణ రాజకీయాలను వేడెక్కించేలా చేశాయా..అనర్హత అంశంలో పై చేయి సాధించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయా...ఈ రెండు పార్టీల  రాజకీయ పట్టుదల తెలంగాణలో ఉద్రిక్తతలకు దారితీస్తుందా... ఇటీవల జరుగుతున్న పరిణామాలు వాటిని స్పష్టం చేస్తున్నాయా.. నేతల ఆవేశపూరిత ప్రసంగాలు హైదరాబాద్ లో అలజడిని సృష్టిస్తున్నాయా..

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  పెద్ద రాజకీయ యుద్దానికే  దారి తీస్తుంది. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించి బీఆర్ఎస్ పార్టీ. ఆ పిటిషన్ ను స్వీకరించి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం నెల రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ ను ఆదేశించింది. 

హైకోర్టు నిర్ణయం తర్వాత తెలంగాణలో రాజకీయాలు చకచకా మారిపోయాయి.ఒక వైపు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సమయంలోనే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. పీఏసీ ఛైర్మన్ గా అరికపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్ అలాంటి వ్యక్తిని పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు దీనిపై కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే  పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించామని  కాంగ్రెస్ చెబుతుంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య  రాజకీయ యుద్దానికి తెరలేసింది.

ఇది ఇలా ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.  అంత వరకు బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య మాటల కొనసాగుతున్న మాటల యుద్దం కాస్తా డైరెక్ట్ వార్ గా మారింది.  పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు , గాజులు పంపిస్తామంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. 

ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినా పరిస్తితి మాత్రం అదుపులోకి రాలేదు.  ఒక వైపు పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేస్తుండగానే అరికపూడి గాంధీ ఒక్క సారిగా కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు దూసుకెళ్లాడు. గాంధీ అనచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ ను తలపించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకుంటే, తొడలు కొడుతూ నానా హంగామా చేశారు. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించిన పోలీసులు వెంటనే గాంధీనీ అదుపులోకి తీసుకున్నారు. ఐనా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు.

తర్వాత సీన్ కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి సీపీ ఆఫీస్ కు మారింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సీపీ ఆఫీసుకు తరలివచ్చారు. మాజీ మంత్రి హరీష్‌ రావు దీనికి నాయకత్వం వహించారు. ఆ పోలీసులను తప్పించే వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమని  సీపీ ఆఫీస్ దగ్గరే హరీష్‌ రావుతో పాటు ఇతర నేతలు కూర్చున్నారు.దీంతో హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి గంట కొద్దీ పోలీస్ వాహనంలో తిప్పుతూ చివరకు అర్థరాత్రి సమయంలో వదిలిపెట్టారు. ఇలా రోజంతా ఒక పెద్ద హైడ్రామాను తలపించింది.

 అయితే ఇద్దరి ఎమ్మెల్యే మధ్య జరిగిన ఈ పొలిటికల్ డ్రామాలో అనూహ్యంగా లోకల్ , నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. కౌశిక్ రెడ్డిపై దాడి సమయంలో అరికపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను తెలంగాణ బిడ్డను ఆంధ్రా వాళ్లు వచ్చి దాడి చేస్తే చూసుకుంటూ ఊరకుంటామా... రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని కౌశిక్ రెడ్డి అనడం రాజకీయంగా కలకలం రేపాయి.దీంతో ఇద్దరి మధ్య వ్యవహారం ప్రాంతీయ రూపం దాల్చుకుంది. అయితే కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరాటం సరైనదే కానీ దానికి ప్రాంతీయ కోణం తీసుకురావడం ఎంత వరకు సమంజసం అని కాంగ్రెస్ తో పాటు ఇతర వర్గాలు కూడా తప్పుబట్టాయి. 

అయితే కౌశిక్ రెడ్డి చేసిన  వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను తీవ్ర ఇరకాటంలో పడేశాయి. మొన్నటి వరకు పదేళ్లు అధికారంలో ఉన్నంత సేపు గుర్తుకు రాని ఆంధ్ర పదం ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోగానే బీఆర్ఎస్ కు గుర్తుకు వచ్చిందా అని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది బీఆర్ఎస్ పై విమర్శలు కురిపించాయి. కౌశిక్ రెడ్డి ఆవేశంగా చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కు రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగేలా చేశాయి.తెలంగాణ వచ్చాక సెటిలర్లు అందరూ బీఆర్ఎస్ కు అండగా ఉంటూ వస్తున్నారు. 

అందునా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పరిధిలోనే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ ఓటు బ్యాంకును కలిగిన సెటిలర్ల విషయంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చాలా డ్యామేజ్ చేస్తాయని బీఆర్ఎస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అసలే కొద్ది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాంటి తరుణంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందా అని బీఆర్ఎస్ టెన్షన్ పడుతున్నారట. దీని నష్ట నివారణ చర్యల కోసం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అన్న భావనలో బీఆర్ఎస్ ఉందంట. ఈ అంశాన్ని కేవలం కౌశిక్ రెడ్డి వ్యక్తిగత అంశంగా చూడాలని బీఆర్ఎస్ అంటోంది. గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య గొడవగానే ఈ పరిణామాన్ని చూడాలని బీఆర్ఎస్  పెద్దలు చెబుతున్నారు.

అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అడ్వంటేజ్ గా తీసుకుంటుంది. హైదరాబాద్ లో రాజకీయంగా బలపడడానికి ఇదే మంచి తరుణమని దీనిని రాజకీయంగా వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందంట. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకొని హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని వ్యూహాలు రచిస్తుందంట. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ది పొందాలన్నదే కాంగ్రెస్ ప్లానట. అందుకే  ఈ అంశంపై వీలైనంత ఎక్కువ ఫోకస్ పెట్టాలని అనుకుంటుందంట.

మరోవైపు రాజకీయ నేతల తీరుపై హైదరాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. నేతల రాజకీయం కోసం తమను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కావడం తప్పా వచ్చేదేమీ ఉండదని అంటున్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్నామని అలాంటిది ఇప్పుడు కొత్తగా మళ్లీ తెరపైకి ఈ ప్రాంతీయ విభేధాలు తలెత్తేలా రాజకీయాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని హైదరాబాదీలు సీరియస్ అవుతున్నారు. నేతల ఇలా ప్రవర్తిస్తే హైదరాబాద్ అభివృద్ధిపై కూడా ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దుందుడుకు చర్య బీఆర్ఎస్ కు ఎంత లాభం జరిగిందో ఏమో కానీ ఆయన చేసిన కామెంట్స్ తో మాత్రం హైదారాబాద్ లో రాజకీయంగా  పార్టీకీ నష్టం జరుగుతుందనే భయంలో బీఆర్ఎస్ ఉంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి..రాజకీయంగా ఇది ఏ పార్టీకీ డ్యామేజ్..ఏ పార్టీకీ ఇమేజ్ వస్తుందో భవిష్యత్తులో తేలనుంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News