Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం.. రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Letter To Telangana Farmers: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై రైతులకు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని.. ఇందుకు సబ్‌ స్టేషన్‌లలోని బుక్‌లే సాక్ష్యమని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోందన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 16, 2023, 04:19 PM IST
Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం.. రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Letter To Telangana Farmers: రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించిందని ఫైర్ అయ్యారు. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామన్నారు. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందని.. ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందన్నారు. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ రైతు లోకానికి  బహిరంగ లేఖ రాశారు.  

"రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుంది. 

పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదు. కానీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలింది. కానీ కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుంది. రైతులకు ఎరువులు ఫ్రీగాభిస్తామని ప్రభుత్వం మోసం చేసింది. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్‌లే దీనికి సాక్ష్యం.

కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అందుకే అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బక్ లను వెనక్కు తెప్పించుకుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయి. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు. రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశం. ఈ సమావేశాల్లో మన సమస్యలపై నిలదేసేందుకు సిద్ధం కండి. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. సమస్యలు పరిష్కరించుడో.. బీఆర్ఎస్ ను బొంద పెట్టుడో తేల్చేద్దాం. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం. ఇందుకు యావత్ తెలంగాణ రైతు లోకం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నా. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.." అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

అంతకుముందు బోనాల సందర్భంగా లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఈ సందర్భంగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయటపడిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఫలక్ నామా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని పొడగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం  హైదరాబాద్ నగరం నుంచే వస్తుందని చెప్పారు. మెట్రో నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు.

Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   

Also Read: AP Team in IPL: ఐపీఎల్‌లో ఏపీ టీమ్.. రూట్ మ్యాప్ సిద్ధం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News