నారా భువనేశ్వరికి పురంధేశ్వరి సంఘీభావం... నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...

Purandheswari supports Bhuvaneshwari: తన సోదరి నారా భువనేశ్వరిపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం తనను తీవ్రంగా కలచివేసిందని దగ్గుబాటి పురంధేశ్వరి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. నైతిక విలువల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 11:42 AM IST
  • నారా భువనేశ్వరికి సోదరి పురంధేశ్వరి సంఘీభావం
    వ్యక్తిత్వ హననం తనను తీవ్రంగా కలచివేసిందన్న పురంధేశ్వరి
    నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కామెంట్
నారా భువనేశ్వరికి పురంధేశ్వరి సంఘీభావం... నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...

Purandheswari supports Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిండు అసెంబ్లీలో తన సతీమణిని, కుటుంబాన్ని అవమానపరిచారంటూ చంద్రబాబు కన్నీటిపర్యంతమవడం చాలామందిని కలచివేసింది. చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా అని వైసీపీ (YSRCP) వర్గీయులు విమర్శిస్తుండగా... పలువురు ప్రముఖులు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి నారా కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

'శ్రీమతి భువనేశ్వరిపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం నన్ను తీవ్రంగా కలచివేసింది. తోబుట్టువులమైన నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం. విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.' అని పురంధేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని సైతం భువనేశ్వరికి (Bhuvaneshwari) సంఘీభావం ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని.. కానీ వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలందరూ టీడీపీ వెంటే ఉన్నారని సుహాసిని పేర్కొన్నారు.

శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఇంత అవమానాలను ఎన్నడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గౌరవ సభ కాదు... కౌరవ సభ అని విమర్శించారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానంటూ... సభకు నమస్కారం చేసి వాకౌట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య భువనేశ్వరి పట్ల వైసీపీ నేతలు అవమానకర రీతిలో మాట్లాడారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. 

Also Read: వైసీపీలో విషాదం... గుండెపోటుతో ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం...

మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తాము భువనేశ్వరిని (Nara Bhuvaneshwari) పల్లెత్తు మాట అనలేదని చెప్తున్నారు. భార్య పేరుతో చంద్రబాబు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాను గానీ, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గానీ భువనేశ్వరిని పల్లెత్తు మాట అనలేదన్నారు. ఒకవేళ భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడి ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు (Chandrababu Naidu)... ఇప్పుడు భువనేశ్వరిని అడ్డుపెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమయ్యే భువనేశ్వరి పేరుతో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News