హోటల్లో కుమారస్వామితో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశం

Last Updated : Aug 31, 2018, 12:48 PM IST
హోటల్లో కుమారస్వామితో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌లో శుక్రవారం ఉదయం ఈ బేటీ జరిగింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైవున్న కనకదుర్గా దేవిని దర్శించుకునేందుకు కుమారస్వామి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగానే కుమారస్వామిని చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు అతిథిగా వెళ్లి హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి విజయవాడ రావడం, చంద్రబాబు వెళ్లి ఆయన బస చేసిన హోటల్లోనే కలవడం వంటివి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

అయితే, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ఆ ఊహాగానాలను కొట్టిపారేశాయి. ఈ సమావేశం వెనుక ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారవర్గాలు స్పష్టంచేశాయి. 

Trending News