TV Actor Killed: జమ్మూకశ్మీర్‌లో దారుణం... టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు...

Jammu Kashmir TV Actor Killed: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ టీవీ నటిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 11:26 PM IST
  • జమ్మూకశ్మీర్‌లో టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
  • ఇంటి ఎదుటే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు
  • లష్కరే తోయిబా పనిగా అనుమానిస్తున్న పోలీసులు
 TV Actor Killed: జమ్మూకశ్మీర్‌లో దారుణం... టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు...

Jammu Kashmir TV Actor Killed:  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో బుధవారం (మే 25) ఓ టీవీ నటిని కాల్చి చంపారు. ఉగ్రవాదుల దాడిలో ఆమె మేనల్లుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతి చెందిన టీవీ నటిని జమ్మూ పోలీసులు అమ్రీన్ భట్‌ (35)గా గుర్తించారు. చదూరాలోని హుష్రూ ప్రాంతంలో అమ్రీన్ భట్ ఇంటి ఎదుటే ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అమ్రీన్‌ భట్‌ను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారని పోలీసులు వెల్లడించారు. ఆమె మేనల్లుడికి చేతిలో బుల్లెట్ గాయమైనట్లు తెలిపారు. రాత్రి 7.55గం. సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమ్రీన్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హుష్రూ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

అమ్రీన్ భట్ హత్యను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా ఖండించారు. అమాయక మహిళలు, చిన్నారులను పొట్టనబెట్టుకోవడం సమర్థనీయం కాదన్నారు. అమ్రీన్ భట్ హత్య తనను షాక్‌కి గురిచేసిందన్నారు. 

ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. శ్రీనగర్‌లో మంగళవారం (మే 25) ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడేళ్ల అతని కుమార్తె కూడా గాయపడింది.

తాజాగా అమ్రీన్ భట్ హత్య జరిగిన బుద్గాం జిల్లాలోని చదూరా ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రాహుల్ భట్ అనే కశ్మీర్ పండిట్‌ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. తహసీల్ కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ క్లర్క్‌గా పనిచేస్తున్న రాహుల్ భట్‌పై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యతో కశ్మీర్ అంతా అట్టుడికింది. కశ్మీరీ పండిట్లంతా ఎక్కడికక్కడ రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చదూరాలో కశ్మీరీ పండిట్ల నిరసను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. 

Also Read: Schneider Electric In TS: తెలంగాణలో సెనెజర్ కొత్త యూనిట్‌ - మరో వెయ్యి ఉద్యోగాలు

Also Read: Hyderabad As Life Sciences Capital: లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్.. దావోస్‌‌లో మంత్రి కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News