యూపీ: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించండి

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారంనాడు బహిరంగ ప్రదేశాల్లో, మతపరమైన, ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Jan 8, 2018, 12:52 PM IST
యూపీ: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించండి

లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారంనాడు బహిరంగ ప్రదేశాలతో పాటు మతప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అన్ని లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. 

శబ్ద కాలుష్యం (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2000లోని నిబంధనల ప్రకారం, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నుండి ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

గత వారంలో, అలహాబాద్ హైకోర్టు నియమించిన బెంచ్ లౌడ్ స్పీకర్లను మసీదులు, దేవాలయాలు, గురుద్వారాలు, అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయటానికి ముందు సంబంధిత యాజమాన్యాల నుండి వ్రాతపూర్వక అనుమతి పొందారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలోనే.. లౌడ్ స్పీకర్లు విషయంలో వ్రాతపూర్వక అనుమతి పొందని స్థలాలపై సర్వే నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. జనవరి 10 నాటికి పరిస్థితిని అంచనా వేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

"బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన లౌడ్ స్పీకర్లు చుట్టుపక్కల 10 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వనిస్థాయిని కలిగి ఉండకూడదు. ప్రైవేట్ ప్రదేశాల్లో 5 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని ఉండకూడదు" అని  ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ కార్యదర్శి (హోం) అరవింద్ కుమార్ అన్నారు.

పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేయబడిన బృందం జనవరి 10 కల్లా ముందస్తు అనుమతి లేకుండా బిగించిన లౌడ్ స్పీకర్ల వివరాలను దాఖలు చేస్తుంది. దీని తరువాత జనవరి 15 నాటికి సంబంధిత బాధితులకు ఆ  వివరాలు తెలియజేయాలి. వీరికి ఐదు రోజులు గడువు ఇస్తుంది. ఈ ఐదు రోజుల సమయంలో వారు సంబంధిత ప్రభుత్వ అధికారులకు  అనుమతుల కోసం అర్జీలు పెట్టుకోవచ్చు. లేనిపక్షంలో జనవరి 20న స్పీకర్లను తొలగిస్తారు.

పైన పేర్కొన్న నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, మరియు / లేదా ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఏ ప్రభుత్వ అధికారైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే.. అతనిపై చర్యలు తీసుకుంటారు.

Trending News