HYDRAA Bandi Sanjay: నా ప్రాణం తీశాకే 'హైడ్రా' పేదోళ్ల ఇళ్లు కూల్చాలి: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar Comments On HYDRAA Demolish: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన ప్రాణం తీశాకే ప్రజల ఇళ్లు కూల్చాలని హెచ్చరించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 30, 2024, 11:07 AM IST
HYDRAA Bandi Sanjay: నా ప్రాణం తీశాకే 'హైడ్రా' పేదోళ్ల ఇళ్లు కూల్చాలి: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

HYDRAA Demolish: జలాశయ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఇళ్లపై హైడ్రా చేస్తున్న దాడులను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఖండించారు. తమ ప్రాణాలు తీశాకే ప్రజల ఇళ్లు కూల్చాలని స్పష్టం చేశారు. తమ ప్రాణాలను అడ్డు పెట్టయినా ప్రజల ఆస్తులను కాపాడుతామని ప్రకటించారు. సంపన్నుల ఇళ్లు కూల్చకుండా పేదలవి కూలుస్తుండడంపై తప్పు బట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Danam Nagender: దానం నాగేందర్‌ సంచలనం.. పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పా..

 

స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సోమవారం కరీంనగర్‌లో నిర్వహించగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. 'అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి తెరదీస్తోంది' అని ఆరోపించారు.

ఇదీ చదవండి:  కమిషనర్‌ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్‌..

'కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుంచి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు' అని బండి సంజయ్‌ హెచ్చరించారు. 'ప్రజలకు బీజేపీ ఆయుధంగా మారబోతోంది. మా ప్రాణాలను అడ్డు పెట్టి అయినా ప్రజల ఆస్తులను కాపాడతాం. మా ప్రాణాలను తీసిన తరువాత పేదల ఇళ్లపైకి హైడ్రా దాడులు చేసుకోవాలి' అని ప్రకటించారు. హైడ్రా తీరును దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హైడ్రా దాడులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి పై నిప్పులు చెరిగారు. తమిళనాడులో డీఎంకే కుటుంబ రాజకీయాలను సైతం తూర్పారపట్టారు. ఏమన్నారంటే....

'జీతాలకే పైసల్లేక అల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజల చేతికి చిప్ప చేతికిచ్చి బిచ్చగాళ్లను చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. చెరువులు, కుంటలను అక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా  కూల్చివేస్తుందని భావించాం. కానీ పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చి వాళ్లకు నిలువ నీడలేకుండా చేస్తోంది. హైడ్రా తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగొక్కోంటుంది. ఇళ్లను కూల్చి నిలువ నీడలేకుండా చేస్తే ప్రజలు ఏమైపోవాలి? ఎట్లా బతకాలి?' అని కేంద్ర మంత్రి సంజయ్‌ ప్రశ్నించారు.

'ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే... ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలనా? పేదల గొంతు నొక్కడమే ఇందిరమ్మ పాలనా? 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలనా?' అని బండి సంజయ్‌ నిలదీశారు. ఇకనైనా ఇట్లాంటి రాక్షస, దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలని సూచించారు. 'మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు కట్టుకున్న ఇండ్లను మీ కళ్ల ముందే కూల్చివేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News