Revanth Reddy: కల్లాల్లో రైతుల చావులకు కేసీఆరే కారణం...

Revanth Reddy: వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కల్లాల్లో ధాన్యం కుప్పలపై రైతులు గుండె పగిలి చనిపోతే... కలెక్టర్లు అక్కడికి వెళ్లి సహజ మరణమని చెప్తున్నారని ఆక్షేపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 06:12 PM IST
  • వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
    కల్లాల్లో రైతులు చనిపోతున్నా పట్టించుకోవట్లేదని విమర్శలు
    ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవలేదని మండిపడ్డ రేవంత్
Revanth Reddy: కల్లాల్లో రైతుల చావులకు కేసీఆరే కారణం...

Revanth Reddy: కల్లాల్లో రైతుల చావులకు ముఖ్యమంత్రి కేసీఆరే (CM KCR) కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సాధారణంగా దసరా పండగకు వరి ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) మొదలై దీపావళి వరకు పూర్తి కావాలన్నారు. కానీ సంక్రాంతి సమీపిస్తున్నా రాష్ట్రంలో ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవలేదని ఆరోపించారు. గతంలో తాను వద్దన్నా వరి పండించినందుకు... కేసీఆర్ ఇప్పుడు రైతులపై కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీ వేర్వేరు కాదని... టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలేనని విమర్శించారు. ఇద్దరు కలిసి రైతులకు ఉరి వేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరి ధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్‌లో చేపట్టిన రెండు రోజుల దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

గతంలో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజా కొంటామన్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని... కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసిందని అన్నారు. కల్లాల్లో ధాన్యం కుప్పలపై రైతులు గుండె పగిలి చనిపోతే... కలెక్టర్లు అక్కడికి వెళ్లి సహజ మరణమని (Farmers deaths in Telangana) చెప్తున్నారని ఆక్షేపించారు. తద్వారా రైతుల చావులను కూడా అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.3లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) కట్టిన కేసీఆర్.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తానని గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడదే ప్రాజెక్టు కింద పండించిన పంటను ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అక్కడ 4 రోజులు ఉన్నప్పటికీ... కేంద్రం అపాయింట్‌మెంట్ కోరనే లేదన్నారు. ఓవైపు రైతులు చనిపోతుంటే ఫాంహౌస్‌లో ఉన్న నీకు మానవత్వం ఉందా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు మేలు చేసే ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు.

Also Read: Pocharam Srinivas Reddy: కరోనా నుంచి కోలుకున్న పోచారం..ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్..

కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో పాటు రైతులకు (Telangana Farmers) 9 గంటల ఉచిత్ విద్యుత్, ఆహార భద్రతా చట్టం వంటివి కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి క్వింటాలు వరి ధాన్యం ధర రూ.400 ఉంటే... ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.1030కి పెంచిందన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రించిందని... ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థను తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News