Revanth Reddy About ORR Scam: కేసీఆర్, కేటీఆర్ అధికారంలో లేకపోయినా.. నెల నెలా వందల కోట్లు వచ్చే స్కెచ్ వేశారు

Revanth Reddy About ORR Scam: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై పలు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో, కేటీఆర్ విదేశాల్లో స్థిరపడినా వందల కోట్లు వచ్చిపడేలా ఆదాయ వనరులు ప్లాన్ చేశారన్నారు.  

Written by - Pavan | Last Updated : May 5, 2023, 04:43 AM IST
Revanth Reddy About ORR Scam: కేసీఆర్, కేటీఆర్ అధికారంలో లేకపోయినా.. నెల నెలా వందల కోట్లు వచ్చే స్కెచ్ వేశారు

Revanth Reddy About ORR Scam: " హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై 2006లో తీసుకున్న రూ. 6,696 కోట్ల రుణం గత ఏడాది మార్చి 31తో ముగిసింది. ఇప్పుడు ఓఆర్ఆర్‌పై రుణం లేదు. ఓఆర్ఆర్‌కు ప్రస్తుతం ఏ రకంగా చూసిన లక్ష కోట్ల ఆస్తులున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు ఏడాదికి 700 కోట్ల ఆదాయం వస్తోంది. ఆ లెక్కన 30 ఏళ్లలో ప్రభుత్వానికి రూ.21-22 వేల కోట్ల ఆదాయం సమాకూరుతుంది. 30 ఏళ్ల ఆదాయాన్ని తనఖా పెడితే.. వచ్చే ఆదాయంలో 70 శాతం 15 వేల కోట్ల రుణం ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది. 48 గంటల్లో రుణం ఇప్పించేందుకు నేను కృషి చేస్తా. కేసీఆర్ ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు ఎందుకు తొందర. 3 నెలల్లో మీ ప్రభుత్వం పోతుంది. 3 నెలల్లో పోయే ప్రభుత్వం 30 ఏళ్లకు లీజు ఇస్తుంది. తక్షణమే ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేసి స్విస్ ఛాలెంజ్ విధానంలో బేస్ ప్రైస్ రూ. 7388 కోట్లతో కొత్త టెండర్లను ఆహ్వానించాలని” టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రైవేటుకు కట్టబెడుతున్నారు అని ప్రశ్నించారు. “ఓఆర్ఆర్ టెండర్ల వెనుక వేల కోట్ల రూపాయాలు చేతులు మారాయి. ఐఆర్బీ సంస్థను ముందు పెట్టి ఫెనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ కేటీఆర్ మిత్రులు ఈ సంస్థలోకి వస్తారు. తద్వారా ఈ సంస్థ కేటీఆర్ చేతుల్లోకి వెళ్తుంది. రేపు కేటీఆర్ అమెరికాలో స్థిరపడ్డా, కేసీఆర్ ఫామ్ హౌస్లో సేద తీరుతున్నా నెలకు రూ.100 కోట్ల ఆదాయం వచ్చే వనరుగా ఓఆర్ఆర్‌ను వినియోగించుకునే ప్రయత్నం జరుగుతోంది” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఓఆర్ఆర్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతుంటే సంబంధిత అంశంపై వివరణ ఇవ్వకుండా తాను ఇరుక్కుపోతాననే కేటీఆర్ ముఖం చాటేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి? అని రేవంత్ ప్రశ్నించారు. బిడ్ నిర్వహణ ఎన్‌హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శకంగా జరిగిందని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పారు. కానీ ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో ఎన్‌హెచ్ఏఐ అభ్యంతరాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుంది. 30 ఏళ్లకు లీజుకు ఇస్తే.. 2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారుతుంది. దాంతో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెండర్ అయినా 15 - 20 ఏళ్లకు మించి ఇవ్వలేదు. 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి కాకుండా 15-20 ఏళ్ల వరకే టెండర్ వ్యవధి ఉండాలని ఎన్‌హెచ్ఏఐ సూచించింది. అయినప్పటికీ ఓఆర్ఆర్ ను ఏకంగా 30 ఏళ్లకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఈ విషయంలో ఎన్ హెచ్ఏఐ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అని రేవంత్ ప్రశ్నించారు.

ప్రభుత్వంలో ఏదైనా కాంట్రాక్టు కానీ, ఆస్తుల వేలం కానీ, భూముల వేలం కానీ నిర్వహణకు ఒక విధానం ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల వేలం నిర్వహించాలి అంటే దానికి ముందుగా బేస్ ప్రైస్ నిర్ధారణ జరగాలి. ఆ ధర కంటే ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడితే వాళ్లకు కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఓఆర్ఆర్ టెండర్ లో ఎక్కడా బేస్ ప్రైస్ ప్రస్తావన లేదు. నిన్నటి అరవింద్ కుమార్ గారి ప్రెస్ నోట్ లో కూడా ఆ విషయం ప్రస్తావించ లేదు. ఈ రహస్యం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు బేస్ ప్రైస్ అన్నది నిర్ధారించకుండా ఎక్కడైనా టెండర్లు నిర్వహిస్తారా? బేస్ ప్రైస్ పెట్టాము కానీ చెప్పం అని అంటున్నారు. అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా? బేస్ ప్రైస్ చెబితే వచ్చే నష్టం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ అంశంపై ఇంత జరుగుతున్నా తండ్రీ కొడుకులు బయటకు వచ్చి వివరణ ఇవ్వడంలేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓఆర్ఆర్ పై 2006 లో 6,696 కోట్లు రుణం తీసుకుంది. గత ఏడాది మార్చి 31 తో ఆ రుణం తీరిపోయింది. ఇప్పుడు ఓఆర్ఆర్ పై రుణం లేదు. అట్లాంటి ఓఆర్ఆర్ ను కేసీఆర్ కు అమ్మేసుకునే హక్కు ఎవరు ఇచ్చారు అని రేవంత్ ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ కారిడార్ టెండర్ పిలవడానికి ముందు..హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) పరిధిలో ఉండేది. టెండర్ల మధ్య ఓఆర్ఆర్ ను హెచ్ఎండీఏకు బదిలీ చేశారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ ఎండీ సంతోష్ ను మార్చి రిటైరైన బీఎల్ఎన్ రెడ్డిని నియమించి ఆ వ్యవహారాన్ని పూర్తి చేశారు. ఓఆర్ఆర్ ను కేవలం ఐఆర్బీ కు ఐనకాడికి కట్టబెట్టేందుకే హెచ్ఎండీఏ పరిధిలోకి మార్చడం నిజం కాదా? హెచ్జీసీఎల్ ఎండీ సంతోష్ ను మార్చి బీఎల్ఎన్ రెడ్డిని నియమించడం వెనుక కారణం కూడా ఇదే కదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి బ్యాంకు నుంచి 15 వేల కోట్లు 48 గంటల్లో రుణం ఇప్పించేందుకు నేను కృషి చేస్తా. కేసీఆర్ ప్రభుత్వానికి..ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు ఎందుకు తొందర. 3 నెలల్లో మీ ప్రభుత్వం పోతుంది. 3 నెలల్లో పోయే ప్రభుత్వం 30 ఏళ్లకు లీజు ఇస్తుంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.

ఐఆర్బీ సంస్థ బిడ్ లో రూ.7,272 కోట్లు మాత్రమే దాఖలు చేస్తే... టెండర్ వివరాలు ప్రకటించే నాటికి అది రూ.7,380 కోట్లుగా ఎలా మారింది. ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యత అంటే... గ్రీనరీ బాధ్యత కూడా ఉంటుంది. కానీ, ఐఆర్బీ సంస్థకు ఆ బాధ్యత నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్రీనరీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.40 కోట్లు. అంటే, 30 ఏళ్లకు రూ.1200 కోట్లు. ఈ లెక్కన ఐఆర్బీ కి వాస్తవంగా రూ. 6000 కోట్లకే టెండర్ దక్కినట్టు లెక్క అని రేవంత్ వ్యాఖ్యానించారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని అరవింద్ కుమార్ సమర్థించుకుంటున్నారు. కానీ మాజర్ సంస్థపై లు దేశాల్లో కేసులు నమోదయ్యాయి అని రేవంత్ పేర్కొన్నారు.

ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి ఏప్రిల్ 11న టెండర్లు ఓపెన్ చేస్తే... కానీ, హైఎస్ట్ బిడ్డర్ గా ఐఆర్బీ సంస్థ ఎంపికైందని. రూ.7,380 కోట్లకు 30 ఏళ్ల పాటు సంస్థ కాంట్రాక్టు దక్కించుకుందని ఏప్రిల్ 27న ప్రకటించారు. ఏ కాంట్రాక్టులోనైనా టెండర్లు ఓపెన్ చేయగానే వివరాలు వెల్లడిస్తారు. ఈ  కాంట్రాక్టు విషయంలో 16 రోజులు ఎందుకు వివరాలు సీక్రెట్ గా ఉంచారు? ఈ 16 రోజుల్లో జరిగిన గూడుపుఠాణీ ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ఐఆర్బీ సంస్థపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ సంస్థ 2017 లో కొద్ది రోజులు టోల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. రోజుకు రూ.87 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.60 లక్షలే చెల్లిస్తుండటంతో డిపాజిట్ గా ఉన్న రూ.25 కోట్లు సీజ్ చేసి... ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసింది వాస్తవం కాదా... అట్లాంటి కంపెనీ ఇప్పుడు మళ్లీ ఎట్లా తెరమీదకు వచ్చింది. ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

“అరవింద్ కుమార్ మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆర్టీఐ ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా? తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రయివేటుకు అమ్మడానికి వీల్లేదు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అగ్గువకే ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. ఓఆర్ఆర్ బిడ్ లో అవినీతి నిజం, దోపిడీ నిజం. దీనికి సూత్రధారి పాత్రధారి అరవింద్ కమార్. ఆయనపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు పిర్యాదు చేస్తాం. కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, డీవోపీటీ కు అరవింద్ కుమార్ పై ఫిర్యాదు చేస్తా. ఓఆర్ఆర్ అంశంపై విచారణ చేయాల్సిందిగా కాగ్ కూడా పిర్యాదు చేస్తాం” అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దోపిడీని అడ్డుకునే వరకు కాంగ్రెస్ పోరాటం ఉంటుంది. ఆయా సంస్థలు చర్యలు తీసుకోకపోతే అంతిమంగా న్యాయ పోరాటానికి వెళతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్
ఈ నెల 8న సరూర్ నగర్ లో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సభలో యూత్ డిక్లరేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు నిరుద్యోగులు, విద్యార్ధుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఆ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులను ఎలా ఆదుకుంటామో డిక్లరేషన్ రూపంలో ఆ సభలో వివరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

 

దేశం గర్వించేలా చేసినందుకు.. రెజ్లర్లకు ఇదేనా రివార్డ్?:రేవంత్ రెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్ల‌తో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ట్వీటర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతుండగా, ఒక ఒలింపిక్ పతక విజేత, ఇతర రెజ్లర్‌లపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం నిరసనకారులపై తన బలాన్ని ప్రయోగిస్తోంది. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు!. పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేసినందుకు ఇదేనా రివార్డ్...?!’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Trending News