Who is YS Anil Reddy: వైయస్ కుటుంబం నుంచి మరో యువనేత.. ఎవరికి చెక్ పెట్టేందుకు ?

Who is YS Anil Reddy: వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్‌ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా ?

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 03:17 AM IST
Who is YS Anil Reddy: వైయస్ కుటుంబం నుంచి మరో యువనేత.. ఎవరికి చెక్ పెట్టేందుకు ?

Who is YS Anil Reddy: వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్‌ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా ? వచ్చే ఎన్నికల్లో పోటీ సైతం చేయబోతున్నారా ? ఇంతకీ ఈ యువనేత వస్తే ఎవరికి చెక్ పెట్టబోతున్నారు ? పార్టీలో నెంబర్ 2 గా చెప్పుకునే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేందుకే తీసుకువస్తున్నారా ? కడప రాజకీయల్లో కీలకంగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఒకవేళ వివేకానంద రెడ్డి హత్యకేసులో అరెస్ట్ అయితే ఆ స్థానంలో ఈ యువనేతనే బాధ్యతలు తీసుకుని 2024 లోక్ సభ ఎన్నికల్లో కడప ఎంపీగా బరిలో దిగుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ యువనేత ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఇంతకీ వైఎస్ కుటుంబం నుంచి వచ్చే మరో యువనేత ఎవరో వైసీపీ నాయకులకు తెలియంది కాదు కానీ ప్రజలకు మాత్రం అంతగా తెలియకపోవచ్చు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో కాదు వైఎస్ అనిల్ రెడ్డినే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తుల్లో వైఎస్ అనిల్ రెడ్డి ఒకరు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ అన్ని ఆర్థిక వనరులను పర్యవేక్షించేది వైఎస్ అనిల్ రెడ్డియేనని తెలుస్తోంది. వైఎస్ అనిల్ రెడ్డి తనకి అప్పగించిన పనులను విజయవంతం చేయడంలో దిట్ట. ఇలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు తెరవెనుక ఉంచిన వైఎస్ జగన్ ఇక తెరపైకి తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభకు పోటీ చేయించడమా లేక రాజ్యసభకు పంపడమా అనే అంశంపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

వైఎస్ అనిల్‌రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, వైఎస్ అనిల్ రెడ్డిని హస్తినకు పంపితే అటు రాజకీయంగానూ ఇటు ఆర్థిక కార్యకలాపాలు, విదేశాల్లో ఉన్న వ్యాపార లావాదేవీలన్నీ చక్కబెడతారని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ కుటుంబసభ్యులు వైఎస్ జగన్‌పై అసహనంతో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీఎం వైఎస్ జగన్ వ్యవహారశైలిపై కుటుంబసభ్యులు అసహనంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసినా.. మర్డర్ జరిగి రెండేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ హంతకులను పట్టుకోలేకపోవడంపై మండిపడుతున్నారు. సొంతబాబాయ్ దారుణ హత్యకు గురైతేనే పట్టించుకోలేని జగన్ ఇక తమకు ఏదైనా అయితే పట్టించుకుంటారా అన్న నమ్మకం ఏంటని ప్రశ్నిస్తున్నారట. వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చకే ఇప్పటికే సొంత చెల్లి వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్లిపోయింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉండే వైఎస్ విజయమ్మ పార్టీకి, పదవికి రాం రాం చెప్పేసి కూతురు వెంట వెళ్లిపోయారు. ఇక సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి కూడా వైఎస్ జగన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అందరికి శత్రువులా మారిన వైఎస్ జగన్ ఆ ముద్రను తొలగించుకోవాలంటే అదే ఫ్యామిలీ నుంచి ఒకరిని రాజకీయంగా తీసుకువచ్చి అత్యున్నత స్థానంలో కూర్చోబెడితే వైఎస్ కుటుంబం జగన్‌కు అండగా నిలుస్తారనే భావనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారు. విజయ సాయి రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులతో అంతగా పొసగడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి జోక్యం విపరీతంగా పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు ఎంపీ విజయసాయి రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం.  విజయసాయి రెడ్డి జోక్యం పెరిగిపోవడంతో తామంతా ఏమి చేయలేని దుస్థితలో ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ చర్యలకు ఉపక్రమించి విశాఖకు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తీసుకువచ్చి విజయసాయి రెడ్డి పవర్స్ కట్ చేశారు. ఇక ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డికి అనిల్ రెడ్డితో చెక్ పెట్టిస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడుగా,.. ప్రభుత్వ నిర్వహణ వెనుక షాడో లీడర్‌గా అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్న వైఎస్ అనిల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. 

కడప జిల్లాలో తెరవెనుక ఉంటూ వైసీపీని నడిపిస్తున్న నాయకులలో ప్రథముడు వైఎస్ అనిల్ రెడ్డి అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ అవినాశ్ రెడ్డి జైలుకు వెళ్తే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ అనిల్ రెడ్డి రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కడప లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగడం.. లేకపోతే రాజ్యసభ సభ్యుడిగానైనా పంపుతారని టాక్. ప్రస్తుతం తాడేపల్లి కేంద్రంగా షాడో లీడర్‌గా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్న వైఎస్ అనిల్ రెడ్డి రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
  
వైఎస్ అనిల్‌ రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు సోదరుడు. చెన్నైలో మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. షాడోగా ఉంటూ రాజకీయ మంత్రాంగం నడుపుతుంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తెరచాటున ఉంటూ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారని, సీఎం జగన్‌కు కర్త, క్రియ అన్నీ అనిల్ కుమార్ రెడ్డేనని వైసీపీలో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వైఎస్ అనిల్ ఇప్పటికే ఐవీ లీగ్ ఆఫ్ చర్చ్ మిషన్ ద్వారా విదేశాల్లోనూ తన నెట్ వర్క్‌ను అభివృద్ధి చేసుకున్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న అనిల్‌కు జగన్ వ్యాపారాలు, ఆఫ్రికా తదితర దేశాల్లో ఉన్న గనుల బిజినెస్‌ల గురించి తెలుసని అవన్నీ అనిల్ పర్యవేక్షిస్తుంటారని, రాబోయే రోజుల్లో వైఎస్ అనిల్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మరి భవిష్యత్ లో జరగబోవు పరిణామాలతో అనిల్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ ఆరంగేట్రం ఎటు వైపు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

Trending News