రోహిత్ శర్మ ఆ తప్పు చేయడనుకుంటున్నా: వివిఎస్ లక్ష్మణ్

రోహిత్ శర్మ ఆ తప్పు చేయడనుకుంటున్నా: వివిఎస్ లక్ష్మణ్

Last Updated : Sep 29, 2019, 05:57 PM IST
రోహిత్ శర్మ ఆ తప్పు చేయడనుకుంటున్నా: వివిఎస్ లక్ష్మణ్

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 2న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. వన్డేలు, టీ20ల్లో తప్ప టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడని రోహిత్‌ శర్మకు ఇది ఒకరకంగా సవాలే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన పాత అనుభవాలను నెమరేసుకుంటూ రోహిత్ శర్మకు ఓ సలహా ఇస్తున్నాడు. అదేమంటే.. టెస్టుల్లో తొలుత మిడిల్ ఆర్డర్‌లో ఆడి ఆ తర్వాత ఓపెనర్‌గా స్థిరపడిన తాను మిడిల్ ఆర్డర్‌లో ఆడినంత విజయవంతంగా టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించలేకపోయానని అన్నాడు. తాను తన విధానాన్ని మార్చుకుని పెద్ద తప్పు చేశానని పేర్కొన్న లక్ష్మణ్.. అదే తప్పును రోహిత్ శర్మ చేయడని భావిస్తున్నానన్నాడు. 

అయితే, సీనియర్ ఆటగాళ్లు, టెస్ట్ కెరీర్‌లో రాణించిన మాజీ ఓపెనర్లు, కోచ్‌ల వద్ద ప్రస్తావించగా.. ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవాలంటే ఆట శైలిని మార్చుకోవాల్సి ఉంటుందని వారు సూచించారని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాతే మళ్లీ తన బ్యాటింగ్‌లో అనూహ్యమైన మార్పు వచ్చిందని లక్ష్మణ్ తన పాత అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే మానసిక క్రమశిక్షణ ఎంతో అవసరమని చెప్పిన లక్ష్మణ్.. ఆఫ్‌ సైడ్ వెళ్లే బంతులను వదిలివేయడమే ఉత్తమమని సూచించాడు. అదే సమయంలో సహజ సిద్ధమైన ఆటతీరును మార్చుకుని ఆడటం వల్ల కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం కష్టమేనని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

Trending News