Vijayawada Floods: వరద తగ్గినా ఇళ్లలోకి వెళ్లలేని స్థితి, పాముల భయం

Vijayawada Floods: మూడు రోజుల ముప్పేట జల విలయం తరువాత విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద ఉధృతి తగ్గేకొద్దీ ముంపు ప్రాంతాలు బయటపడుతున్నాయి. సింగ్ నగర్‌లో వరద ప్రవాహం తగ్గుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2024, 01:31 PM IST
Vijayawada Floods: వరద తగ్గినా ఇళ్లలోకి వెళ్లలేని స్థితి, పాముల భయం

Vijayawada Floods: భారీ వర్షాలతో పొంగి పొర్లిన బుడమేరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. విజయవాడ దుఖదాయనిగా పేరొందిన బుడమేరు పోటెత్తడంతో 40 శాతం విజయవాడ నగరం నీట మునిగింది. మూడు రోజుల తరువాత ముంపు నుంచి బయటపడుతోంది. వరద నీరు తగ్గేకొద్దీ మృత దేహాలు, కొట్టుకొచ్చిన వాహనాలు బయటపడుతున్నాయి. 

విజయవాడలో ఇప్పటి వరకూ పరిస్థితి ఒకటైతే ఇక ముందున్న పరిస్థితి మరొకటి. జల ప్రళయంతో విజయవాడలో బుడమేరు పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. బురద మట్టి, వరద నీటితో ఇళ్లు వాకిలి ఏకమయ్యాయి. దాదాపు 3 రోజుల దిగ్భంధనం తరువాత ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతుండటంతో ముంపు నుంచి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు విద్యుత్ సరఫరా లేదు. మరోవైపు తాగు నీటి కొరత. మొత్తం దయనీయ పరిస్థితి నెలకొంది. విజయవాడలో అన్ని ప్రాంతాలకంటే దయనీయంగా మారిన సింగ్ నగర్‌లో వరద నీటి మట్టం తగ్గుతోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3-4 అడుగుల నీరు ఉండనే ఉంది. కానీ ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లలో విష సర్పాల భయం పొంచి ఉంది. ఇళ్లలో దూరిన పాములు ఎక్కడ దాక్కున్నాయో తెలియని పరిస్థితి. 

విద్యుత్ సరఫరా మెరుగుపడేలోగా వరద నీటిలో మునిగిన స్విచ్ బోర్డులు మరమ్మత్తు చేయించుకోవాలి. ఆ తరువాత వాడుకోవాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ ప్రమాదముంది. ఇళ్లలో పేరుకున్న బురదను తొలగించి ఇళ్లు క్లీన్ చేసేందుకే రెండు రోజుల సమయం పట్టేట్టుంది. కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుగోలు చేసిన ఇంటి సామగ్రి మొత్తం నాశనమైంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ ఇప్పుడు పనిచేయవు. ఫ్రిజ్‌లు, టీవీలు నీట మునిగి ఉంటే ఇక పనిచేయవు. 

ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గే కొద్దీ కొట్టుకుపోయిన వాహనాలు బయటపడుతున్నాయి. ఎవరి వాహనాలు ఎటున్నాయో..ఎక్కడికెళ్లాయో వెతుక్కోవల్సి ఉంటుంది. మరోవైపు గత రెండ్రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 12 మృత దేహాల్ని గుర్తించారు. కొట్టుకుపోయిన కార్లు, ద్విచక్రవాహనాలు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. ఈ వాహనాలు ఎంత వరకు పనిచేస్తాయో తెలియదు. ఇన్సూరెన్స్ వస్తుందో లేదో అంతకంటే తెలియదు. 

వరద ముంపు తగ్గడం ఓ ఎత్తైతే ఆ తరువాత కోలుకుని సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా సమయం పట్టనుంది. మరోవైపు వరద భయంతో వేలాదిమంది నగరాన్ని వీడుతున్నారు. ఇళ్లు వాకిలి లాక్ చేసి కట్టుబట్టలతో బయటకు పోతున్నారు. ఇళ్ల వద్ద తాగు నీరు, ఆహారం, మందులు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 

Also read: Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News