ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య.. కారణం ఏంటి ?

హైదరాబాద్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. 

Last Updated : Mar 17, 2018, 04:40 PM IST
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య.. కారణం ఏంటి ?

హైదరాబాద్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లో స్థానికంగా నివాసం వుంటున్న స్వరూప్ జి దాస్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌లోని హౌరాకు చెందిన స్వరూప్ జి దాస్ వృత్తిరీత్యా కంసాలి. గత కొంత కాలంగా తన భార్య, ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్‌లో నివాసం వుంటున్నాడు. అయితే, శనివారం స్వరూప్‌తో పని పడిన ఓ వ్యాపారి అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్వరూప్ నివాసానికి చేరుకున్న పోలీసులు అతడిని బయటి నుంచే పిలిచినట్టు తెలుస్తోంది. 

అయితే, ఎంతసేపు వేచిచూసినా లోపలి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో విసుగుచెందిన పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ స్వరూప్ కుటుంబసభ్యుల మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో స్వరూప్, అతడి భార్యతోపాటు ఇద్దరు చిన్నారులు వున్నారు. చిన్నారుల్లో ఓ ఐదు నెలల బాబు కూడా వున్నాడు. మృతులు సైనెడ్ తాగి సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే స్వరూప్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని వుండి వుంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. 

Trending News