ముందస్తు ఎన్నికలుండవని అమిత్‌‌షా సంకేతం

అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం అయ్యాక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

Last Updated : Jul 15, 2018, 05:25 PM IST
ముందస్తు ఎన్నికలుండవని అమిత్‌‌షా సంకేతం

తెలంగాణలో శుక్రవారం పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం అయ్యాక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. మిషన్ 60+ లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జీలను నియమించడంతొ పాటు నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలవాలన్నారు. ముస్లిం రిజర్వేషన్లు సహా టీఆర్ఎస్ ఇతర నిర్ణయాలపై పోరాడాలన్నారు.

సంఘ్ పరివార్ నేతలతో అమిత్ షా

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా శుక్రవారం హిందూ సంస్థలకు చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం- అయోధ్యలో రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్‌ రద్దు వంటి అంశాలపై కేంద్ర వైఖరిపై సంఘ్‌ పరివార్‌ నేతలు అడగ్గా.. రామమందిరం విషయంలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతున్నాయని, లోక్‌సభ ఎన్నికల నాటికి క్లారిటీ వస్తుందని అమిత్‌షా చెప్పారు. బూత్‌స్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతానికి పూర్తి సహకారం ఇవ్వాలని ఈ సందర్భంగా హిందూ సంస్థలను అమిత్ షా కోరారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎలాంటి పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సన్నద్ధం కావాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానందకు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించే అంశంపై అమిత్‌ షా సమావేశంలో నేతల అభిప్రాయాలను అడిగారని సమాచారం.

సైనాను కలిసిన అమిత్‌ షా

‘సంపర్క్‌ సే సమర్థన్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సైనా, నాలుగేళ్లుగా బీజేపీ దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళుతోందని చెప్పారు. ఇకపైనా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

Trending News