Telangana Election 2023: దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ: మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 07:29 PM IST
Telangana Election 2023: దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ: మంత్రి కేటీఆర్

దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మి మోసం చేసిన వాడే నరేంద్ర మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ధ్వజమెత్తారు. అసలు దేశాన్ని  నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ అని, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో.. మొత్తం భారతదేశమే ఒక బేరోజ్ గార్ మేళాగా మారిపోయిందని మండిపడ్డారు. మోదీ ఇచ్చిన హామీలన్నీ పేకమేడలేనని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014 లో మోదీకి దేశప్రజలు ప్రధానిగా ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచే దేశంలో యువతకు కష్టాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని యువతీ యువకులను నిలువునా మోసం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనందుకు యువతకు బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దేశ చరిత్రలోనే 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత ప్రధాని మోదీ హయాంలోనే నమోదుకావడం అత్యంత సిగ్గుచేటు అని కేటిఆర్ విమర్శించారు.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వం మాదన్నారు. ఇప్పటికే 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసి.. మరో 70,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా పూర్తికాబోతోందన్నారు. అసలు నియామక ప్రక్రియలో జాప్యానికి కారణమే బీజేపీ. పకడ్బందీగా నిర్వహిస్తున్న పరీక్షలకు భంగం కలిగించేందుకు ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్రకు తెరలేపింది బీజేపీయేనని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసేలా పేపర్ లీకేజీకి పాల్పడింది మీ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని కిషన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. మరోవైపు అక్రమ కేసులు వేయిస్తూ.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్న మీ బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.

తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీఐఆర్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం యువతీ యువకుల భవిష్యత్తును దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
 విభజన హామీల్లో ఒకటైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ అమలుచేసి ఉంటే.. ఎంతోమంది యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభించేవని అన్నారు. ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ బిడ్డలకు కొత్తగా అవకాశాలు లభించేవని, వారికి అన్యాయం చేసిన బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అలాగే దశాబ్దాల కల అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కూడా కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడిందని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఒక్కనాడైనా తెలంగాణ విభజన హక్కుల గురించి కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని సూటిగా ప్రశ్నించారు.

సహాయ మంత్రిగా కాకుండా.. నిస్సహాయ మంత్రిగా మారిపోయిన కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ యువతకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. వినూత్న ఆలోచనలు, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడం వల్ల యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో సరికొత్త పంథాలో ఇలాంటి నిర్ణయాలు లేకపోవడం వల్ల దేశ యువతకు తీవ్ర నష్టం జరుగుతోందని స్పష్టంచేశారు.

గత పదేళ్ల ప్రస్థానాన్ని చూస్తే.. కేంద్రంలోని బీజేపీది ఉత్త మాటల ప్రభుత్వం.. తెలంగాణలో ఉన్నది చేతల ప్రభుత్వం అనే విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అర్థరహితమైన ఆర్థిక విధానాలు, నోట్లరద్దు, లాక్ డౌన్ వంటి చర్యలతో ఉపాధి కల్పనను ఘోరంగా దెబ్బతీసిన పాపం బీజేపీదేనని దుయ్యబట్టారు. కొత్త ఉద్యోగాల కల్పన దేవుడెరుగు.. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడి.. యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

Also Read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అలర్ట్

దమ్ముంటే గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినన్ని ఉద్యోగాలను దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భర్తీ చేసిందా కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందో లెక్కలతో సహా చెప్పగలరాఅన్నారు. కిషన్ రెడ్డి భాగస్వామిగా ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం  పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని, ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీలెన్ని అనే విషయంపై శ్వేత పత్రం విడుదల చేసి దమ్ముందాఅని సవాలు విసిరారు. 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పైన, మా పార్టీ పైన విమర్శలు చేయడం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అన్నారు.

ఓవైపు కేంద్రంలో ఉన్న ఖాళీలను నింపకుండా అన్యాయం చేయడమే కాకుండా.. ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం దారుణమని మండిపడ్డారు. ఫలితంగా రాజ్యాంగ నిర్మాత కల్పించిన రిజర్వేషన్ హక్కులను ఎస్సీ ఎస్టీ యువతీ యువకులు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నియామక పరీక్షలను హిందీలో నిర్వహించడం వల్ల వివిధ రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విషయాన్ని మేము మీ దృష్టికి తెచ్చే వరకూ మీకు కనీసం సోయి లేకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు.

తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకునే కుట్రలకు ఇప్పటికైనా కిషన్ రెడ్డి ముగింపు పలికాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టడంతోపాటు.. దేశంలోనే అత్యధికంగా ప్రైవేటురంగంలో ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది. ఓవైపు ఐటీ, మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా వంటి అనేక కీలక రంగాల్లో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం మాది. దేశంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్రగా మారిందని అనేక ప్రఖ్యాత సంస్థలు కితాబు ఇస్తుంటే.. మీరు ఓర్వలేకపోతున్నారని అర్థమవుతోంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కనీస సహకారం లేకున్నా ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం.. యువత ఆకాంక్షల్ని సంపూర్ణంగా  నెరవేరుస్తామన్నారు.  

Also Read: 6 Kg Semi Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 కేజీ MarQ by Flipkart వాషింగ్‌ మెషిన్‌ను రూ.990కే పొందండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News